'సైరా' షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, అక్టోబరు 2న రావడం ఖాయమని ఈమధ్యే వార్తలొచ్చాయి. దాంతో ఫ్యాన్స్ చాలా ఖుషీ అయిపోయారు. ఎందుకంటే 'సైరా'పై మెగా అభిమానుల్లో ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమా గత రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయమని నమ్ముతున్నారు. అయితే ముందు నుంచీ సైరాకి ఎన్నో సమస్యలు. కొన్ని సన్నివేశాలు నచ్చకపోవడం వల్ల రీషూట్లు చేస్తున్నారని చెప్పుకున్నారు.
అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ఈ సినిమా విడుదలకు సిద్ధమవ్వడంతో.. ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే 'సైరా' సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నది టాలీవుడ్ సమాచార్. ఇప్పటికీ కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయాలని చిరంజీవి భావిస్తున్నార్ట. తనకు అత్యంత సన్నిహితులైన రచయితలు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్లాంటివాళ్లకు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని చిరంజీవి చూపించారని, వాళ్ల సలహా మేరకు మళ్లీ మార్పులూ, చేర్పులకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఇలా తీసుకుంటూ పోతే ఇక అంతెక్కడ? ఈ సినిమా ఆగేదెక్కడ? అనేది ప్రధానమైన ప్రశ్న. ఇలా సినిమాకి చెక్కుకుంటూ వెళ్తే అక్టోబరు 2న కూడా రావడం కష్టమే.