బాలీవుడ్లో తాప్సీ నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం 'సాండ్ కీ ఆంఖ్'. భూమి పడ్నేకర్, తాప్సీ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అదో ఊరు. ఆ ఊరిలో ఇద్దరు బామ్మలు. చిన్నతనంలోనే పెళ్లిళ్లు కావడంతో, కుటుంబ కట్టుబాట్లు వారి స్వాతంత్య్రానికి అడ్డుకట్టలు వేశాయి. వారు కోల్పోయిన జీవితాన్ని తమకు పుట్టిన ఆడపిల్లలు కూడా కోల్పోకూడదని భావించిన ఈ ఇద్దరు బామ్మలు తుపాకీలు చేతబట్టారు.
తమ కూతుళ్ల భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని తలంచారు. ఆ క్రమంలో తమ ఆడపిల్లల భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతున్న వారిని తుపాకీతో భయపెట్టాలని చూస్తారు. కానీ వారిలో ఎలాంటి టార్గెట్నైనా ఎంత దూరం నుండైనా తుపాకీతో గురి పెట్టి మిస్సవ్వకుండా పేల్చగల టాలెంట్ ఉందని ఓ వ్యక్తి గుర్తిస్తాడు. వారిని ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహంతో ఆ ఇద్దరు బామ్మలు జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొంటారు.
300 పైగా పతకాలు సాధిస్తారు.. ఇదీ సినిమా కథ. అయితే, ఇది కేవలం కథ మాత్రమే కాదు.. వాస్తవ సంఘటన. ఉత్తరప్రదేశ్లోని జోహ్రి అనే గ్రామానికి చెందిన చంద్రో తోమర్, ప్రకాషీ తోమర్ అనే ఇద్దరు బామ్మల కథే ఇది. ఈ కథని ఆధారంగా చేసుకుని తుషార్ హీరా నందని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బామ్మ పాత్రల్లో తాప్సీ, భూమి పడ్నేకర్లు ఆకట్టుకుంటున్నారు. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.