'సైరా నరసింహారెడ్డి'తో తమన్నా స్టారే మారిపోయింది. మిల్కీబ్యూటీ తమన్నా కాస్తా, 'సైరా లక్ష్మి'గా మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో తమన్నాకి మరో నాలుగైదుగేళ్ల వరకూ తిరుగే లేదనిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల డేట్ కోసం ఎదురు చూస్తోన్న 'దటీజ్ మహాలక్ష్మి'కి సంబంధించి, ఈ సందర్భంగా ఓ లేటెస్ట్ అప్డేట్ తెరపైకి వచ్చింది. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 'సైరా'తో తమన్నాకి దక్కిన ఇమేజ్తో 'దటీజ్ మహాలక్ష్మి'ని క్యాష్ చేసుకోవాలనే యోచనలో చిత్ర యూనిట్ ఉందట. ఈ సినిమా విడుదలకు ఇదే రైట్ టైమ్గా భావిస్తున్నారట. బహుశా దీపావళికే 'దటీజ్ మహాలక్ష్మి'ని విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. నిజమే, ఇమేజ్ రైజింగ్లో ఉన్నప్పుడే కరెక్ట్గా వాడుకోవాలి.
'దటీజ్ మహాలక్ష్మి' టీమ్ ఇన్టైంలో స్పందించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, 'దటీజ్ మహాలక్ష్మి' ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకర్షణీయంగానే ఉన్నాయి. తమన్నా టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశమిది. పక్కా గోదారి జిల్లా అమ్మాయిలా ఈ సినిమాలో తమన్నా నటిస్తోంది. బాలీవుడ్ 'క్వీన్'కి తెలుగు వెర్షన్ అయిన ఈ సినిమా తమిళ వెర్షన్లో కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తమిళంలో తమన్నా నటించిన 'పెట్రొమాక్స్' త్వరలో విడుదల కానుంది. తాప్సీ నటించిన 'ఆనందోబ్రహ్మ'కు తమిళ రీమేక్ ఇది.