మార్చి 31 వరకూ తెలంగాణలో థియేటర్లు మూసేయాలని ఇది వరకే తెరాస ప్రభుత్వం తీర్మాణించింది. దాంతో... నైజాంలో థియేటర్లకు తాళాలు పడ్డాయి. ఇక్కడ సినిమా సందడే లేదు. నిన్నటి వరకూ ఏపీలో థియేటర్లు నడిచాయి. ఈ శుక్రవారం ఒకట్రెండు కొత్త సినిమాలు విడుదల కావాల్సివుంది. ఏపీలోనైనా ఆ సినిమాల్ని ప్రదర్శించాలని పంపిణీదారులు భావించారు. ఇప్పుడు అక్కడ కూడా థియేటర్లకు తాళాలు వేస్తున్నారు.
ఈనెల 31 వరకూ ఏపీలో థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ విషయాన్ని మీడియాకి చెప్పారు. రాష్ట్రంలో కరోనాని కట్టడి చేస్తున్నామని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే థియేటర్లు, మాల్స్ని మూసేస్తున్నామని, స్కూళ్లకు ఇది వరకే సెలవలు ఇచ్చామని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంత్రి సూచించారు.