చిత్రసీమలో రాజకీయాలు ఎక్కువ అని చెబుతుంటారు. ఇక్కడ కొంతమంది పెద్దల ఆధిపత్యమే కనిపిస్తుందని, మిగిలినవాళ్లెవ్వరినీ ఎదగనివ్వరని - రకరకాలుగా అంటుంటారు. ఆ మాటలకేం గానీ, అవసరమైనప్పుడు మాత్రం చిత్రసీమలో కావల్సినంత ఐక్యత, బోలెడంత స్ఫూర్తి కనిపిస్తుంటుంది. పరిశ్రమకు ఏదైనా జరిగితే, సర్వం కదిలి వస్తుంది. చేయూతనిస్తుంది. ఇది వరకు ఎన్నో ఉదంతాలు ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు కరోనా ఉపద్రవంలోనూ అలాంటి స్ఫూర్తే టాలీవుడ్ లో కనిపించింది. కరోనా వల్ల షూటింగులు ఆగిపోయాయి. షూటింగులేంటి ప్రపంచమే ఆగిపోయింది.
రోడ్డెక్కితే గానీ, పొట్ట నింపుకోలేని నిరుపేదల జీవితాలు అస్తవ్యస్థమయ్యాయి. ప్రభుత్వాలు ఎన్నని చేస్తాయి? వాటికి సెలబ్రెటీల సహకారం, వాళ్లందించే తోడ్పాటు చాలా అవసరం. ఈసారీ చిత్రసీమ తనదైన శైలిలోనే స్పందించింది. టాలీవుడ్ లోని బడా హీరోలు భారీ విరాళాలతో ఆదుకోవడానికి ముందుకొచ్చారు. చిన్న హీరోలూ.. తమకు తోచిన స్థాయిలో సహాయం చేశారు. సీసీసీ పేరుతో ఓ ట్రస్ట్ని ఏర్పాటు చేసి, దానికీ విరాళాలు సేకరించారు. ఈ ట్రస్ట్కి ఇప్పటి వరకూ దాదాపు 7 కోట్ల వరకూ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సొమ్ముతో నిరు పేద సినీ కార్మికులు, నటీనటులకు సహాయ సహకారాలు అందించబోతున్నారు. ఇలా ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ డబ్బుతో కార్మికుల కడుపు నింపడంలో మిగిలిన పరిశ్రమతో పోలిస్తే... మనమే ముందున్నాం. ముఖ్యంత్రుల సహాయ నిధికి విరాళాలు అందించడంలోనూ టాలీవుడ్డే టాప్. లాక్ డౌన్కి ముందే స్వచ్ఛందంగా స్పందించి, షూటింగులు ఆపేసింది తెలుగు చిత్రసీమ. ఇలా అన్ని విషయాల్లోనూ మిగిలిన చిత్రసీమకు టాలీవుడ్ ఆదర్శంగా నిలిచింది. ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగాలి. మునుముందూ ఇంతే ఐక్యతతో ముందుకు వెళ్లాలి. వెల్ డన్.. టాలీవుడ్.