ఇంటెలిజెంట్ తరవాత వినాయక్ నుంచి మరో సినిమా ఏదీ రాలేదు. బాలకృష్ణతో ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే అది సెట్ కాలేదు. అయితే ఈలోగా వినాయక్ హీరోగా `శీనయ్య` అనే సినిమా పట్టాలెక్కింది. ఓ ప్రముఖ దర్శకుడు, అందునా దిల్ రాజు లాంటి సంస్థ నుంచి సినిమా అంటే కచ్చితంగా దానిపై ఫోకస్ పడుతుంది. అలా శీనయ్యకు క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. కొంత మేర షూటింగ్ జరుపుకుని కూడా ఈ సినిమా ఆగిపోయింది. ఇంతకీ ఈ సినిమా ఉంటుందా, లేదా? అనేదీ అనుమానమే. కథ విషయంలో దిల్ రాజు అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం.
అయితే ఈ సినిమా వినాయక్ని ఇరకాటంలో పడేసింది. హీరోగా కనిపిస్తున్నానన్న ఉత్సాహంతో దర్శకత్వాన్ని, కథల్నీ పూర్తిగా పక్కన పెట్టేశాడు. పైగా ఈ సినిమా గ్రాండ్గా మొదలైంది. ఇప్పుడు మధ్యలో ఆగిపోతే.. వినాయక్కి అది అవమానమే. ఎలాగూ మొదలెట్టాం కదా అని, కథ బాగోలేకపోయినా సర్దుకుపోయి సినిమా చేయలేరు. మరోవైపు దర్శకుడిగానూ ప్రయత్నాలు చేయలేరు. అలా రెండికీ చెడ్డ రేవడిలా తయారైంది వినాయక్ పరిస్థితి. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలా, వద్దా? అనే విషయంపై దిల్రాజుతో గట్టిగానే సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఓ వారం రోజుల్లో ఈ సినిమా విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.