ఉగాది సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈరోజు సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు మెగాస్టార్ తొలి ట్వీట్ చేశాడు.ట్విట్టర్ ద్వారా అభిమానుల్ని పలకరించడం ఆనందంగా ఉందని, కరోనా పై దేశమంతా కలసికట్టుగా పోరాడాలని చెబుతూ తొలి ట్వీట్ చేశాడు. చిరంజీవి ట్విట్టర్ ఎకౌంట్ కి ఫాలో అయ్యేవారి సంఖ్య క్షణ క్షణానికి పెరుగుతోంది. తొలి రోజే మెగాస్టార్ ట్విట్టర్ లో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే చిరు ట్విట్టర్ ఎంట్రీ చాలా లేటుగా జరిగింది. స్టార్ హీరోలంతా దాదాపుగా రెండు మూడేళ్ల క్రితమే ట్విట్టర్లోకి వచ్చేశారు. తమ అభిమానులతో టచ్లో ఉంటున్నారు.
చిరంజీవికి ఇంత కాలానికి సోషల్ మీడియాపై ప్రేమ వచ్చింది. నిజానికి చిరు ఎప్పుడో రావాల్సింది. తన 150వ సినిమా సమయంలోనే చిరు ట్విట్టర్ ద్వారా ఎంట్రీ ఇస్తాడని భావించారు. కానీ అది జరగలేదు. దానికి ఓ బలమైన కారణం ఉంది. ట్విట్టర్లో అభిమానుల ఆశీర్వాదాలు ఎంత బలంగా ఉంటాయో, విమర్శలూ అన్నే ఎక్కువగా ఉంటాయి. నెగిటీవ్ కామెంట్లూ, పోస్ట్లూ, ట్రోల్స్.. ఇవన్నీ భరించాల్సివస్తుంది. వాటికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే చిరు ఇంత కాలం ట్విట్టర్లోకి రాలేదు. ఇప్పుడు వాటన్నింటినీ చిరు ఎదుర్కోగలడా? అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి చిరు నెగిటీవ్ కామెంట్లని, విమర్శల్నీ చాలా సీరియస్గా తీసుకుంటాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇవన్నీ భరించలేకే రాజకీయాలకు దూరమయ్యారాయన. ఇప్పుడు ట్విట్టర్లో విమర్శలు, నెగిటీవ్ కామెంట్ల సెగ చిరుని లైట్గా తీసుకోగలడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.