ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో .. టాలీవుడ్ భేటీ అవ్వబోతోందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జగన్తో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, జీవిత, త్రివిక్రమ్, కొరటాల శివ, సి.కల్యాణ్ ఈ సమావేశంలో పాల్గొంటారు. చిత్రసీమకు సంబంధించిన సమస్యల్ని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం.
ఇప్పటికే షూటింగులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. థియేటర్ల పునః ప్రారంభం విషయంలో ఈ సమావేశంలో చర్చిస్తారు. నిజానికి కనీసం 15 మంది సభ్యులు సీఎంని కలవాలనుకున్నారు. కానీ ఆరేడుగురు కంటే ఎక్కువ మంది వద్దని జగన్ కోరడంతో.. సభ్యుల సంఖ్య కుదించారు.