జీ తెలుగు లో ప్రసారమయ్యే 'డ్రామా జూనియర్స్' ప్రతి వారం అందరి ఇంట నవ్వులు పంచుతుంది.. కానీ నేడు ఆ కార్యక్రమానికి చెందిన 'గోకుల్ సాయి' ఇంట విషాదం చోటు చేసుకుంది. 'జూ. బాలకృష్ణ' గా అలరించే చిన్నారి 'గోకుల్ సాయి' నేడు ఉదయం డెంగ్యూ జ్వరం తో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మృతి చెందాడు. చిత్తూరు జిల్లా.. మదనపల్లె కు చెందిన యోగేంద్ర మరియు సుమాంజలి దంపతుల రెండవ సంతానం అయిన 'గోకుల్ సాయి కృష్ణ' రెండు రోజుల నుండి అస్వస్థకు గురవ్వగా బెంగళూరు లోని రెయిన్ బో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన తో సినీ పరిశ్రమ శోక సంద్రం లో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న బాలయ్య స్పందించి ఆ చిన్నారి కుటుంబానికి తన ప్రగాడ సానుభూతి తెలియపరిచారు...
"మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - మీ నందమూరి బాలకృష్ణ"