ఇస్మార్ట్‌ జోష్‌.. రామ్‌ రాకతో మళ్ళీ పెరుగుతుందట.

మరిన్ని వార్తలు

వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్స్‌ నేపథ్యంలో జులై 12న విడుదలవ్వాల్సిన సినిమా, జులై 18న విడుదలైనా బాక్సాఫీస్‌ వద్ద వీర కుమ్ముడు కుమ్మేస్తోంది. అదే 'ఇస్మార్ట్‌ శంకర్‌'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటించిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఇప్పటికే, అందరి అంచనాల్నీ తల్లకిందులు చేస్తూ 35 కోట్లకు పైగా షేర్‌ కొల్లగొట్టింది. ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద 'ఇస్మార్ట్‌ శంకర్‌' జోరు తగ్గలేదు. 'డియర్‌ కామ్రేడ్‌' అంతగా ఆకట్టుకోకపోవడం 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి మరింతగా కలిసొచ్చింది. ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

 

అందులో ఒకటి 'రాక్షసుడు' కాగా, మరొకటి 'గుణ'. కార్తికేయ నటించిన 'గుణ'పై బజ్‌ తక్కువగా వుంటే, 'రాక్షసుడు' థ్రిల్లర్‌ ఫ్లిక్‌. దాంతో, 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఈ వీకెండ్‌లో కూడా బాగా లాభపడుతుందని ట్రేడ్‌ పండిట్స్‌ అంచనా వేస్తున్నారు. మరోపక్క, విదేశీ పర్యటన ముగించుకుని హైద్రాబాద్‌కి తిరిగొచ్చిన హీరో రామ్‌, ఇక నుంచి సినిమా ప్రమోషన్లలో పాల్గొనబోతున్నాడట.

 

ఆల్రెడీ 'ఇస్మార్ట్‌ శంకర్‌' టీమ్‌, తమ హీరోతో కలిసి పెద్ద పార్టీ చేసేసుకుంది.. నిన్న రాత్రే జరిగింది. నిర్మాతలతో రామ్‌కి విభేదాలొచ్చాయనీ, అందుకే ప్రమోషన్లు వదిలేసి విదేశాలకు రామ్‌ చెక్కేశాడనీ ప్రచారం జరిగినా, అదంతా ఉత్తదేనని తేలిపోయింది. రామ్‌ రంగంలోకి దిగితే, 'ఇస్మార్ట్‌ శంకర్‌' వసూళ్ళకి కొత్త ఊపు వస్తుందని భావిస్తున్న నిర్మాతలు పూరి జగన్నాథ్‌, ఛార్మి.. మలి విడత ప్రమోషన్స్‌ని షురూ చేయబోతున్నారు. నైజాంలో 'ఇస్మార్ట్‌ శంకర్‌' దుమ్ము రేపుతున్న దరిమిలా, ఇక్కడే రామ్‌తో పబ్లిసిటీని మరింత ఎక్కువగా చేయాలనే ఆలోచనతో వున్నారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS