ముహూర్తం ఫిక్స్‌ చేసిన బాలయ్య!

మరిన్ని వార్తలు

'జైసింహా' సినిమా తర్వాత బాలయ్య 'ఎన్టీఆర్‌' బయోపిక్‌తో బిజీ అయ్యారు. కానీ, రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బాలయ్యను దారుణంగా నిరాశపరిచాయి. దాంతో ఆయన తదుపరి ఆలోచన కాస్త ఆచి తూచి వేయాల్సి ఉంది. ఆ దిశగా బాలయ్య తనకు సూపర్‌ సక్సెస్‌లు అందించిన బోయపాటిశీనుకి ఓటేస్తారనుకున్నారంతా. కానీ బోయపాటికి 'వీవీఆర్‌' ఇచ్చిన షాక్‌తో బాలయ్య అటు వైపు మొగ్గు చూపలేదు. 'జై సింహా' సినిమాతో బాలయ్యకూ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌కీ మధ్య స్నేహం బాగా వికసించింది. ఆ చొరవతోనే ఆయన బాలయ్యకి ఓ అద్భుతమైన స్టోరీ లైన్‌ వినిపించారు. ఆ లైన్‌ నచ్చిన బాలయ్య పూర్తి స్టోరీ డెవలప్‌ చేయాలని సూచించడంతో సంవత్సర కాలంగా ఆయన అదే స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నారు. ఈ లోగా బాలయ్య సినిమాలకు బ్రేక్‌ ఇచ్చేస్తారట.. అనే పుకార్లు కూడా షికార్లు చేసేశాయి.

 

కానీ, వాటిని తోసి పుచ్చుతూ, త్వరలోనే ఈ కాంబో మూవీ పట్టాలెక్కనుందని తాజా న్యూస్‌ బయటికొచ్చింది. ఈ నెల 12న ఈ ప్రాజెక్ట్‌కి ముహూర్తం ఫిక్స్‌ చేశారనీ తెలుస్తోంది. నెలాఖరు నుండే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాని ఉంచబోతున్నారట. గతంలో ఇదే కాంబినేషన్‌లో సంక్రాంతికి విడుదలైన 'జై సింహా' రివర్స్‌ రిజల్ట్‌నిచ్చింది. కానీ ఈ సారి పోజిటివ్‌ రిజల్ట్‌ పక్కా అంటున్నారు. ఇదో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అనీ తెలుస్తోంది.

 

హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇలా పలువురు ముద్దుగుమ్మల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాజకీయాల్లో బాలయ్య యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ తరపున ఇంతకు ముందు కన్నా రెట్టించిన బాధ్యత బాలయ్యపై ఉంది. ఈ తరుణంలో ఇటు సినిమాలనూ, అటు రాజకీయాలనూ బాలయ్య ఎలా మ్యానేజ్‌ చేయగలరో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS