హాట్ హీరోయిన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్స్గా నిలిచింది ఛార్మి. అలాగని కేవలం ఆ తరహా పాత్రలకే పరిమితం కాలేదు. మంత్ర లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. జ్యోతిలక్ష్మిగా అలరించింది. ఇప్పుడు నిర్మాతగా మారింది. జ్యోతిలక్ష్మి తరవాత నటనకు దూరమైంది ఛార్మి.
ఎప్పటికైనా, ఏదో ఓ సినిమాలో మళ్లీ కనిపిస్తుందిలే అనుకున్నవాళ్లకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పేసింది. ఇక తను సినిమాల్లో కనిపించదట. నటనకు ఎప్పుడో పుల్ స్టాప్పడిపోయిందని, ఇక మేకప్ వేసుకునే ఛాన్సే లేదని తేల్చి చెప్పేసింది. జ్యోతిలక్ష్మి తన చివరి సినిమా అని క్లారిటీ ఇచ్చేసింది ఛార్మి. పదిహేనేళ్లుగా నటిస్తూనే ఉన్నానని, నటన తనకు బోర్ కొట్టిందని, నిర్మాతగా కొత్త పనిని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా అని చెప్పుకొచ్చింది.
ఇకపై కేవలం నిర్మాణ రంగంవైపే దృష్టి పెడతానని, పూరితో కలసి సినిమాల్ని నిర్మిస్తానని క్లారిటీ ఇచ్చింది. అయితే దర్శకత్వ ఆలోచన మాత్రం లేదట. ''సినిమా అంటే నాకిష్టం. దానిపై ప్రేమ పోదు. నటనకు దూరమైనా... నిర్మాతగా కొనసాగుతూనే ఉంటా'' అంటోంది. ఛార్మి, పూరి కలసి `ఇస్మార్ట్ శంకర్` అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ షూటింగ్ కోసమే గోవా వెళ్లింది ఛార్మి. శుక్రవారం గోవాలోనే తన పుట్టిన రోజు కూడా జరుపుకోబోతోంది.