ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్తో నువ్వా నేనా.. అనేలా బరిలోకి దిగుతున్నాడు ఆ హీరో. ఇంతకీ ఎవరా హీరో? ఏంటా పొగరు? అనుకుంటున్నారా? సీనియర్ నటుడు కరాటే 'కింగ్ అర్జున్' మేనల్లుడు 'ధృవ సర్జా'. కన్నడ హీరో. ఈయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'పొగరు'. 'కెజీఎఫ్' పుణ్యమా అని, అతి చిన్న చిత్ర సీమగా కౌంట్ చేసే, కన్నడ పరిశ్రమ కూడా ప్యాన్ ఇండియా మూవీస్ని తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపిస్తోంది.
ఆ కోవలోనే 'పొగరు' రూపొందింది. ప్యాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా క్లైమాక్స్ ప్రస్తుతం హైద్రాబాద్లో జరుగుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్గా తెరకెక్కుతోన్న ఈ క్లైమాక్స్ సీన్ కోసం హీరో, ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్తో తల పడనున్నాడట. అందుకోసం ఫ్రెంచ్ బాడీ బిల్డర్ మోర్గాన్ అస్తే, అమెరికన్ బాడీ బిల్డర్స్ కై గ్రీనే, జాక్ లుకాస్, జో లిన్డర్ వంటి ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ షూటింగ్లో పాల్గొంటున్నారు.
'భైరవగీత' ఫేం 'ధనుంజయ్' ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. ఇక హీరో విషయానికి వస్తే, కొండల్ని సైతం కరిగించేసే కండలు తిరిగిన శరీరంతో భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కన్నడ కుట్టి రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రష్మికాకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్'తో యష్కి ఆయా భాషల్లో మంచి పేరు దక్కింది. 'పొగరు'తో ధృవ సర్జా అలాంటి క్రేజ్ దక్కించుకుంటాడేమో చూడాలిక.