ఈ మధ్యనే టీడీపీలో చేరిన సీనియర్ నటి దివ్యవాణి కూసింత ఓవరాక్షన్ చేస్తోందనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల్లో ఒకరైన రోజా కూడా చంద్రబాబుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక చంద్రబాబు కుట్ర ఉందనీ, తెర వెనక ఉండి, ఈ హత్యకు స్క్రీన్ప్లే రాసింది చంద్రబాబే అని రోజా ఆరోపించారు. ఇక ఈ ఆరోపణలకు దివ్యవాణి రీ కౌంటర్ ఇచ్చారు. జగన్ని రావణాసురునిగా, రోజాని శూర్పణఖగా అభివర్ణిస్తూ టీడీపీ అధినాయకుడి వద్ద మార్కులు కొట్టేయాలనే ప్రయత్నం చేశారు.
నటిగా మంచి పేరున్న దివ్యవాణికి రాజకీయాల్లో ఇంతవరకూ ఏమంత మంచి గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. పేరుకు తగ్గట్లుగా ఆమె మాటల్లో దివ్యం కనిపించలేదింతవరకూ. గతంలో చంద్రబాబు నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష వేదికపై దివ్యవాణి నరేంద్రమోడీపై తన అనవసర ఆవేశపూరిత ప్రసంగంతో నలుగురిలోనూ నవ్వుల పాలైపోయారు. మరోసారి ఇప్పుడు వైసీపీ నేత రోజాని కెలికి ఇంకెంత నవ్వుల పాలైపోతారో ఆమె అర్ధం చేసుకోవాలి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలూ సహజమే అయినా, కానీ ఏ ఒక్కరికీ ఏ పార్టీ శాశ్వతం కాదు కదా. విమర్శలు చేసే ముందు ఒక్కసారి ముందు చూపుతో ఆలోచించుకుంటే మంచిది దివ్యవాణి గారూ.!