స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ని తెరకెక్కించాలని ఆయన తనయుడు బాలయ్య అనుకున్నప్పుడు స్క్రిప్టు వర్క్ కోసం ఓ కమిటీని వేయడం జరిగింది. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కనుసన్నల్లో ఈ స్క్రిప్టు పనులు జరిగాయి. అయితే తేజ లైన్లోకి వచ్చాక ఆ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేశాడట. ఆ మార్పులు చంద్రబాబుకు, లోకేష్కూ నచ్చకపోవడంతో తేజని కావాలనే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి క్రిష్ జాగర్లమూడి వచ్చి చేరాడు. లేటెస్టుగా ఈ విషయాన్ని అఫీషియల్గా బాలయ్య అనౌన్స్ చేశారు. ఇకపోతే క్రిష్ కూడా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నారట. అయితే క్రిష్ చేసే మార్పుల్లో ఏముంది? అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. అలాగే క్రిష్ దర్శకత్వం అనగానే ఎన్టీఆర్ బయోపిక్కి కాస్త వెయిట్ వచ్చిందన్న మాట వాస్తవమే. బాలయ్యతో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రాన్ని విజయవంతంగా, అనుకున్న టైం లోగానే తెరకెక్కించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు క్రిష్. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ కూడా క్రిష్ దర్శకత్వంలో విజయవంతం కాగలదని ఆకాంక్షిస్తున్నారు ఆయన అభిమానులు.
ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్లో 'మణికర్ణిక' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే క్రిష్ ఆ పనులు పూర్తి చేసుకుని, ఎన్టీఆర్ బయోపిక్పై దృష్టి పెట్టనున్నాడనీ తెలుస్తోంది.