సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'రోబో 2.0' సినిమాని ఏప్రిల్లో విడుదల చేస్తున్నామంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన అనౌన్స్మెంట్తో అప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టాలీవుడ్ సూపర్స్టార్ సినిమా 'భరత్ అనే నేను' నిర్మాతలు కొంత అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు కాస్తా నిదానపడి ఆలోచించిన భరత్ అండ్ టీమ్ ఏది ఏమైనా ఈ సినిమాని ముందుగా అనుకున్న టైంకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. అలాగే అదే టైంలో మరో స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే 'రోబో' రాకముందు ఈ రెండు సినిమాల నిర్మాతలు కూర్చొని ఓ మాట మాట్లాడుకుందాం అనుకునేసరికి, మధ్యలో 'రోబో 2.0' వచ్చి పడింది. అయితేనేం ముందుగా అనుకున్న డేట్కి ఏమాత్రం తగ్గేది లేదనీ భరత్ అండ్ టీమ్ డిసైడ్ అయిపోయారట.
ఏప్రిల్ 27 2018న ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ సినిమాలో మహేష్బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడు. కాగా ఇక మిగిలింది సూర్య అండ్ టీమ్. బన్నీ వాస్ నిర్మాణంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా రూపొందుతోంది. తొలిసారిగా రచయిత వక్కంతం వంశీ మెగా ఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాని కూడా సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్లోనే విడుదల చేయాలని యోచిస్తోంది చిత్ర యూనిట్.
కాగా మహేష్ సినిమా ఉండడంతో ఒక వారం అటూ, ఒక వారం ఇటూగా ఈ సినిమాని ఇంచుమించుగా ఏప్రిల్లోనే విడుదల చేయనున్నారు. చూడాలి మరి ఈ సారి ఏప్రిల్ ఓ పక్క సూర్యుని తాపం, మరో పక్క స్టార్స్ సినిమాలతోనూ మస్త్ వేడెక్కిపోనుందన్న మాటే!