వంశీ పైడిపల్లితో సినిమాని పక్కన పెట్టేశాడు మహేష్ బాబు. ఆ స్థానంలో... పరశురామ్ సినిమాని పట్టెక్కించే పనిలో ఉన్నాడు. వంశీ సినిమా ఆగిపోవడం చిత్రసీమని షాక్కి గురి చేసింది. ఈ సినిమా ఆగిపోవడమేమిటి? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. మహర్షిలాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి. పైగా ఈ సినిమాతో మహేష్ కుటుంబ సభ్యుడిలా మారిపోయాడు వంశీ. అలాంటి వంశీ సినిమా పక్కన పెట్టడం ఎవ్వరికీ మింగుడు పడడం లేదు.
అయితే తాను చెప్పకుండా ఈ విషయం బయటకు రావడం పట్ల మహేష్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడని తెలుస్తోంది. సినిమా ఎందుకు ఆగిపోయిందన్న విషయంలో కొన్ని వెబ్ సైట్లు, ఛానళ్లు చిలవలు పలవలుగా కథనాలు వండి వార్చడం చూసిన మహేష్ కాస్త గరమ్ గరమ్గా ఉన్నాడట. ఓ సినిమా ఆగిపోవడం, మరో సినిమాని హఠాత్తుగా పట్టాలెక్కించడం మంచి సంకేతాలు పంపించే విషయాలు కావు. పైగా వంశీకీ తనకూ మధ్య ఉన్న సంబంధాన్ని దెబ్బకొట్టే అంశాలు. అందుకే మహేష్ ఈ లీకులు ఎవరిచ్చారో ఆరా తీస్తున్నాడట. ఈ సినిమా ఆగిపోవడం వల్ల మైత్రీ మూవీస్ లాభపడుతుంది. ఎందుకంటే వెంటనే తమ బ్యానర్లో సినిమా మొదలెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా పరశురామ్తో సినిమాని పట్టాలెక్కిస్తున్నది వాళ్లే. అందుకే ఈ లీకులు మైత్రీ నుంచే వచ్చే అవకాశాలున్నాయని మహేష్కి సమాచారం అందిందట. అందుకే మైత్రీ నిర్మాతల విషయంలోనూ మహేష్ అలిగాడని తెలుస్తోంది.