సంక్రాంతి వస్తుందంటే స్టార్ హీరోల సినిమాల విడుదల హడావిడి ఎప్పుడూ ఉండేదే. కాకపోతే ఈ సారి విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ ఆసక్తి ప్రధాన కారణం ఇద్దరు బడా హీరోలు ఒక రోజు వ్యవధిలో బాక్సాఫీస్ పోరుకు దిగనున్నారు. టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం 'అల వైకుంఠపురంలో' జనవరి 12న విడుదల అవుతున్నాయి. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమాకి ఓపెనింగ్స్ ఎక్కువ వస్తాయి ..? ఓవరాల్ గా ఎవరి సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ? అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.
అయితే మధ్యలో రజినీకాంత్ 'దర్బార్' డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ రజినికి ఉన్న స్టార్ డమ్ రీత్యా ఆయన కూడా ఈ ఇద్దరు హీరోలకు గట్టిపోటీనే ఇవ్వనున్నారు. అయితే మహేష్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ ఐనప్పటికీ కామెడీ పాళ్ళు కూడా ఎక్కువే ఉంటాయని.. ముఖ్యంగా సినిమా అంతా మంచి కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయని, అలాగే హీరోహీరోయిన్ల మధ్య నడిచే ట్రైన్ ఎపిసోడ్ లో కూడా హిలేరియస్ కామెడీ ఉంటుందని అందుకే ఈ సినిమాకే ఎక్కువ ఆదరణ ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక మాటల మాంత్రికుడు పంచ్ ల కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురంలో కూడా ఆయన మార్కు కామెడీ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిన్ గా పూజాతో ఆఫీస్ ఎపిసోడ్స్ మరియు బన్నీ మురళి శర్మల మధ్య మంచి కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట. ఆ రకంగా ఈ సినిమాకే ఫ్యామిలీ ప్రేక్షకులు మొగ్గు చూపుతారని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఏమైనా ఎక్కువ కామెడీని పండించి ప్రేక్షకులను బాగా నవ్వించిన సినిమానే సంక్రాంతి విజేతయ్యే అవకాశం ఉంది.