'అఖిల్' సినిమాతో గంపెడు ఆశతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్కి భారీ నిరాశనే మిగిల్చింది ఆ సినిమా రిజల్ట్. దాంతో అమ్మడు మళ్లీ తెలుగులో ఎక్కడా కనిపించలేదు. కోలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది. అక్కడ అమ్మడిని మంచి ఆదరణే దక్కింది.
ఇకపోతే ఈ మధ్య తెలుగులోనూ సాయేషా సందడి మొదలైంది. అయితే డైరెక్ట్ తెలుగు సినిమాలో కాదు. కానీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'చినబాబు' సినిమాలో సాయేషా నటించింది. కార్తీ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో మంచి విజయం దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆ రకంగా సాయేషాకి తెలుగులో మంచి హిట్ దక్కినట్లే.
'అఖిల్' సినిమాతో మర్చిపోయిన సాయేషాను తిరిగి 'చినబాబు'తో గుర్తు చేసుకునేలా చేసింది ఈ సినిమా విజయం. ఈ విజయాన్ని సాయేషా ఎంజాయ్ చేస్తున్న ఈ తరుణంలోనే ఆమె నుండి మరో సినిమా వచ్చేస్తోంది. అదే 'గజనీకాంత్'. ఆర్య హీరోగా నటిస్తున్నాడు. ఆర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన గతంలో నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
ఆ రకంగా త్వరలో రానున్న 'గజనీకాంత్'పై బాగానే అంచనాలున్నాయి. ఈ నెల 27న ఆర్య - సాయేషా 'గజనీకాంత్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంటే మళ్లీ సాయేషా తెలుగులోకి తన ఉనికిని బాగానే చాటుకుంటోందన్నమాటే. ఈ సినిమా కూడా హిట్ ఖాతాలోకి వెళ్లిందంటే, తర్వాత టాలీవుడ్లోనూ సాయేషా పాతుకుపోయే అవకాశాలు లేకపోలేవు.