ఓటీటీ ప్రాధాన్యం క్రమక్రమంగా పెరుగుతోంది. వెబ్ సిరీస్లకూ, వెబ్ మూవీలకు ప్రేక్షకులు మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారు. టాప్ స్టార్లు సైతం ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి మొగ్గు చూపిస్తుండడంతో వాటికి క్రేజ్ పెరిగింది. అందులో భాగంగా శ్రుతిహాసన్ ఓ వెబ్ మూవీలో నటించడానికి ఒప్పుకుంది. ఈ వెబ్ మూవీకి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తారు.
`మహానటి`తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాగ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం `రాధే శ్యామ్`తో బిజీగా ఉన్నారు. ప్రభాస్ తో సినిమా మొదలవ్వడానికి ఇంకా సమయం ఉంది. ఈలోగా ఈ వెబ్ మూవీని పూర్తి చేయనున్నాడు నాగ అశ్విన్. ఈ వెబ్ మూవీ నిడివి కేవలం 30 నిమిషాలే ఉంటుందట. ఇందుకోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఓ ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు. షూటింగ్ అంతా ఆ సెట్లోనే జరగబోతోందట. కేవలం 15 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.