మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలైన హల్ చల్ చేస్తున్నాయి. ఆ పాటలు వింటే ఈ సినిమాపై మరింత నమ్మకం కలుగుతోంది. విజయ్ సేతుపతి లాంటి స్టార్ ఈ చిత్రంలో నటిస్తుండడం, మైత్రీ మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించడం, అందులో సుకుమార్ కూడా భాగస్వామి కావడంతో ఈ చిత్రంపై నమ్మకాలు మరింత పెరుగుతున్నాయి.
ఈ సినిమా క్లైమాక్స్కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇదో యాంటీ క్లైమాక్స్ అని తెలుస్తోంది. విషాదంతమైన ప్రేమకథలు తెలుగులో విజయవంతమైన దాఖలాలు చాలా తక్కువ. అయితే ఈమధ్య తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. వాళ్లకు ఈ సినిమా క్లైమాక్స్ విపరీతంగా నచ్చేస్తుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. పతాక సన్నివేశాల్లో వైష్ణవ్తేజ్ నటన కంటతడి పెట్టించేలా ఉంటుందట, చాలా రోజుల పాటు ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటారని, ఆ స్థాయిలో ఈ సినిమా పతాక సన్నివేశాల్ని రూపొందించారని తెలుస్తోంది. మరి ఆ క్లైమాక్స్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.