తమిళనాట ఆర్జీవీ ప్రకంపనలు.!

మరిన్ని వార్తలు

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'తో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు తమిళనాడులో ప్రకంపనలకు శ్రీకారం చుట్టారు. లేటెస్ట్‌గా 'శశికళ' సినిమాని అనౌన్స్‌ చేశారు. జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని రామ్‌గోపాల్‌ వర్మ గతంలోనే ప్రకటించాడు. శశికళ యాంగిల్‌ నుండి ఈ సినిమా ఉండబోతుందని అప్పట్లోనే వర్మ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఇంతవరకూ పట్టాలెక్కలేదు. 

 

 

తాజాగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విషయంలో వర్మకు దక్కిన రెస్పాన్స్‌ చూసి, అదే ఉత్సాహంతో 'శశికళ' ప్రాజెక్ట్‌ని ప్రకటించి, తమిళనాట ప్రకంపనలకు తెర లేపారు. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'తో ఎన్టీఆర్‌ జీవితంలోని కాంట్రవర్సీ పార్ట్‌ని పట్టుకుని సంచలనం సృష్టించిన రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు మరోసారి దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని కాంట్రవర్సీ పార్ట్‌కే జై కొట్టారు. ఆమె జీవితంలో డెత్‌ మిస్టరీ ఇంతవరకూ వీడలేదు. ఆ మిస్టరీ పైనే వర్మ కన్ను పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నారట రామ్‌గోపాల్‌ వర్మ. 

 

ఆల్రెడీ జయలలితపై రెండు బయోపిక్స్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఒకటి నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతుండగా, బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌తో ఎ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కిస్తున్న 'తలైవి' ఇంకోటి. కాగా రామ్‌గోపాల్‌ వర్మ తాజా ప్రకటనతో అందరి దృష్టీ ఇప్పుడిటు మళ్లింది. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని చూశాం కదా. వర్మ తాను ఏం చూపిస్తానని చెప్పారో, అదే చూపించి సక్సెస్‌ అయ్యారు. అలాగే 'శశికళ' సినిమాతోనూ ఆయన అనుకున్నట్లే జయలలిత డెత్‌ మిస్టరీని ఛేదించగలడు.. అని అంతా నమ్ముతున్నారు. చూడాలి మరి వర్మ ఏం చేస్తారో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS