సిద్ధార్ధ్ హీరోగా తెరకెక్కుతోన్న 'గృహం' సినిమాలో నటిస్తోంది ముద్దుగుమ్మ ఆండ్రియా. గతంలో 'తడాఖా' చిత్రంలో సునీల్కి జంటగా నటించింది ఈ బ్యూటీ. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే మళ్లీ తెలుగు సినిమాల వైపు దృష్టి పెట్టింది. ఇకపై తెలుగులో వరుసగా సినిమాలు చేస్తానంటోంది. 'గృహం' ఓ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్య హారర్ సినిమాలంటే భయం ఉండడం లేదు. ఎందుకంటే హారర్కి కామెడీ టచ్ ఇచ్చి, కొత్త ఫార్మేట్తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. సో దాంతో దెయ్యం సినిమాల్ని కూడా కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు.
కానీ హీరో సిద్ధార్ధ్ మాత్రం తమ సినిమా చాలా భయపెడుతుందంటున్నాడు. సమాజంలో ఎంతో మంది ప్రమాదరకమైన మనుషులున్నారనీ, అలాంటి వారిని చూపించే ప్రయత్నమే మా సినిమా అంటున్నాడు. అంతేకాదు యదార్ధ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇంతవరకూ లవర్బోయ్లా, చాక్లెట్ బోయ్లా కనిపించిన సిద్ధార్ధ్ తొలి సారిగా తనలోనూ ఇలాంటి ఓ యాంగిల్ ఉందని చూపించబోతున్నాడు 'గృహం' సినిమా ద్వారా. ఈ సినిమాకి సిద్దార్ధ్ నిర్మాణ భాగస్వామ్యం కూడా అందించారు.
ఈ సినిమాని కోసం చాలా కసరత్తులు చేశాడట. హీరోయిన్ ఆండ్రియా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. పర్ఫామెన్స్కి అవకాశమున్న క్యారెక్టర్ అట. ఇదిలా ఉండగా, ఆండ్రియా కేవలం నటి మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ మంచి సింగర్. అందుకే తమిళంలో అమలాపాల్ నటిస్తున్న 'భాస్కర్ ఒరు రాస్కెల్' సినిమాకి పాట పాడింది. ఆ పాట సినిమాకే కీలకం అట. కాగా ఆండ్రియా తెలుగులో నటిస్తున్న 'గృహం' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.